రాజస్థాన్లో ఘోరం జరిగింది. భిల్వారా జిల్లా కేసర్ పూరా వద్ద శనివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు చనిపోయారు. భిల్వారా నుంచి వేగంగా వస్తున్న ట్రాలర్ ఎదరుగా వస్తున్న వ్యాన్ను బలంగా ఢీకొట్టటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో చనిపోయిన వారు కోటా నుంచి భిల్వారా వెళుతున్నారని పోలీసులు తెలిపారు. కోటా ఫోర్ లైన్ రోడ్డు మీద జరిగిన ఈ ప్రమాదంలో ట్రేలర్ ఢీకొట్టగానే వ్యాన్ లో మంటలు రేగాయి. చనిపోయిన వారిలో ఆరుగురు బిగోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింగోలి శ్యామ్ ప్రాంతానికి చెందినవారు కాగా మరొకరు సాల్వాతియా వాసి.
మృతి చెందినవారిలో ఉమేశ్(40), ముఖేశ్(23), జయమ్నా(45), అమర్ చంద్(32), రాజు(21),రాధేశ్యామ్(56) ,శివాల్(40) ఉన్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై గంటపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బిజౌలియా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వ్యానులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.