కంటైన్మెంట్ జోన్లలో స్టేషన్లను మూసివేత
నేరుగా టికెట్లు కొనుక్కునే అవకాశం లేదు
స్మార్ట్ కార్డులు, ఆన్లైన్ బుకింగ్ మాత్రమే
ఈ నెల 7 నుంచి దేశ వ్యాప్తంగా మెట్రో సేవలు అందుబాటు లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈనెల 7 నుంచి 12 వ తేదీ లోగా అన్ని మార్గాల్లో మెట్రో సేవలు అందుబాటు లోకి వస్తాయి. కేంద్ర మంత్రి హర్దీప్సింగ్ పూరి దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నే పథ్యంలో ప్రయాణికులతోపాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, మెట్రోరైలు కార్పొ రేషన్లు, అనుసరించాల్సిన నిబంధనలను వివరించింది. కంటైన్మెంట్ జోన్లలోని మెట్రో స్టేషన్లను మూసి ఉంచుతారు. ప్లాట్ఫాంల పైన రైళ్లలో భౌతిక దూరం పాటించాలని, దీనికోసం మార్కింగ్ చేయాలని సూచించింది. మాస్క్లు లేకుండా ఎవరినీ స్టేషన్ల లోకి, రైళ్ల లోకి అనుమతించరాదని స్పష్టం చేసింది. డబ్బులు చెల్లించి తీసుకు నేందుకు అన్ని మెట్రో స్టేషన్లలో మాస్కులు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎలాంటి లక్షణాలు లేని వారిని శరీర ఉష్ణోగ్రత పరిశీలించాకనే లోనికి అనుమతించాలని వివరించింది.
అన్ని ప్రవేశ , నిష్క్రమణ ద్వారాలు, లిఫ్టులు, ఎస్క్లేటర్లు సహా అన్ని ప్రదేశాల్లో శానిటైజర్ తప్పనిసరిగా అందుబాటు లోకి ఉంచాలని పేర్కొంది. నేరుగా డబ్బులు చెల్లించే పద్ధతి లేకుండా, స్మార్ట్ కార్డులు, ఆన్లైన్ బుకింగ్కు మాత్రమే అనుమతించాలని ఆదేశించింది. ప్రయాణికులు తక్కువ లగేజీతో రావాలని సూచించింది. రైళ్లలో ఎసి సరఫరా, గాలి మారేందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని కేంద్ర ప్రభుత్వం తెలియచేసింది.