గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు సమీపిస్తున్నసమయంలో హైదరాబాద్ మహానగర అభివృద్ధి కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార, విపక్ష నేతలు సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకుంటున్న నేప థ్యంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య సవాల్ నడిచింది. దీ్తో తలసాని స్వయంగా భట్టి ఇంటికెళ్లి ఆయన్ను తీసుకొని, డబుల్ బెడ్రూం ఇళ్లను చూపించారు. నిన్న, ఇవాళ రెండ్రోజుల పాటు పర్యటించారు. అయితే.. ఈ పర్యటనకు సడన్ బ్రేక్ పడింది. దాంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తిరిగి మాటల యుద్ధం మొదలైంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇళ్లు చూపించమంటే పక్క నియోజకవర్గాల్లో ఇళ్లు చూపిస్తున్నారని భట్టి విక్రమార్క మండిపడ్డారు. దాంతో అక్కడ నుంచి తలసాని వెళ్లిపోయారు. నాగారం మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ నేతలు వెనుదిరిగారు. భట్టీ మాత్రం రాంపల్లిలోనే ఆగిపోయారు. ఎవరి దారిన వారు వెళ్లిపోవడం తో రెండో రోజు కొనసాగుతున్న ఇళ్ల పరిశీలన అర్దాంతరంగా ముగిసింది. మరోవైపు తలసాని, మల్లారెడ్డి, మేయర్ బొంతురామ్మోహన్ మాత్రం కొల్లూరుకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల నేతలు మీడియా ముందు విమర్శల వర్షం కురిపించుకున్నారు.
‘ఇళ్లు చూపించమంటే ప్రభుత్వం పారిపోయింది. నిన్న చూపిన 3,400 ఇళ్లను నేను పరిగణిస్తున్నాను. హైదరాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టకుండా ఇతర చోట్ల కట్టిన లెక్కలు చూపించి ప్రజల్ని మోసం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలు ఇళ్లు చూపించమంటే మహేశ్వరంలో చూపిస్తున్నారు. 5 నియోజకవర్గాల్లో కేవలం 3,400 ఇళ్లే కట్టారు. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడున్నాయో చెప్పాలని సీఎం కేసీఆర్, కేటీఆర్కు ఛాలెంజ్ చేస్తున్నాను. లక్ష ఇళ్లు నిర్మించే వరకు ప్రభుత్వం వెంట పడతాం’ అని భట్టీ విక్రమార్క ఛాలెంజ్ చేశారు.
మరోవైపు, భట్టి కామెంట్స్పై మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ ఇళ్లు పూర్తిగా చూడకుండా మాట్లాడొద్దు. ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లన్నీ చూపిస్తున్నాం. ఓర్వలేక కాంగ్రెస్ నేతలు కుంటిసాకులు చెబుతున్నారు. వస్తే అన్నీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూపిస్తాం. ఈరోజు వరకే తిరుగుతాం.. మిగిలిన ఇళ్ల వివరాలు ఇస్తాం. తుక్కగూడలో కట్టినా.. గ్రేటర్ ప్రజలకే ఇస్తాం’ అని తలసాని మీడియాతో అన్నారు.
ఈ ‘డబుల్’ గేమ్ ఇక్కడితో ముగిసినట్టేనా..లేదంటే ముందు ముందు మరిన్ని సవాళ్లు..ప్రతి సవాళ్లకు దారితీస్తుందా..?