తెలుగు రాష్ర్టాలు ఉలిక్కిపడేట్టు చేసిన హేమంత్ పరువు హత్యకేసు గంటకో మలుపు తిరుగుతోంది. పోలీసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే పలువుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కీలక విషయాలను రాబట్టినట్టు తెలుస్తోంది. హేమంత్ కుటుంబ సభ్యులు, హేమంత్ తరపు హైకోర్ట్ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకరరేపు ఉదయం సైబరాబాద్ సీపీ సజ్జనార్ను కలవనున్నట్టు సమాచారం.
హేమంత్ కేసులో ఇప్పటికే 18 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యలో మొత్తం 25 మంది ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తాజాగా నిగ్గుతేల్చారు. కొద్దిసేపటి క్రితమే మరో ఏడుగురిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే 14 మందికి జ్యుడీషియల్ రిమాండ్ విధించడం జరిగింది. 6 నెలలు పాటు అవంతిని తల్లిదండ్రులు హౌస్అరెస్ట్ చేసినట్లు వెల్లడైంది.
ఇంటి చుట్టూ అవంతి తండ్రి, మేనమామ సీసీ కెమెరాలు పెట్టినట్లు తేలింది. అయితే కరెంట్ పోవడంతో ఇంటి నుంచి తప్పించుకున్న అవంతి.. హేమంత్ దగ్గరికి వెళ్లిపోయింది. జూన్ 10న రాత్రి హేమంత్, అవంతి ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయాలన్నీ విచారణలో తేలాయని పోలీసులు చెబుతున్నారు. కాగా.. మరోసారి నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించనున్నట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ఇదిలావుండే, హేమంత్ కుమార్ హత్య కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిదే.