సుశాంత్ అనుమానాస్పద మృతి కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న అతని ప్రియురాలు రియా చక్రవర్తిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మంగళవారం అరెస్ట్ చేసింది. డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధాలున్నట్లు గుర్తించిన ఎన్సీబీ ఆమెను అదుపులోకి తీసుకుంది. డ్రగ్స్ కేసులో రియాను మూడు రోజుల పాటు ఎన్సీబీ విచారించింది. ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని కూడా ఎన్సీబీ అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.
సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు విచారణలో రియా అంగీకరించింది. అయితే.. తాను మాత్రం డ్రగ్స్ వినియోగించలేదని, కేవలం సుశాంత్ కోసమే కొనుగోలు చేశానని రియా చెప్పుకొచ్చింది. తీగ లాగితే డొంక కదిలినట్టుగా.. సుశాంత్ కేసులో డ్రగ్స్ వినియోగం దగ్గర మొదలైన విచారణ, బాలీవుడ్లో డ్రగ్స్ మత్తులో మునిగితేలే వారి పేర్లను రియా బయటపెట్టేవరకూ వెళ్లింది. మొత్తం 25 మంది బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లను ఎన్సీబీ విచారణలో రియా చక్రవర్తి బయటపెట్టినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే విచారణను మరింత వేగవంత చేసిన ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్ను అరెస్టు చేశారు. రియా సూచనల మేరకు సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని షోవిక్ విచారణలో వెల్లడించాడు. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్, ల్యాప్ట్యాప్ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు. అలాగే డ్రగ్స్ స్మగ్లర్ బాసిత్ను ఐదు సార్లు కలిసినట్టు రియా అంగీకరించడంతో మంగళవారం అరెస్ట్ చేశారు.
అయితే రియా డ్రగ్ కేసులో బాలీవుడ్కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.