అమెరికా ఎన్నికల ప్రచారాన్ని ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కుతారా అన్నదే ఈ ఆసక్తికి కారణం. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారం తీవ్రత కూడా పెరిగింది. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు ఎటు వైపు ఉన్నారన్నది అభ్యర్థుల విజయావకాశాలను తేల్చుతుంది. ఈ సారి ఎన్నికల్లో హిందువుల ఓట్లే కీలంగా మారతాయని విశ్లేషకులు బావిస్తున్నారు.
హిందూ అమెరికన్ల మద్దతు కోరుతూ రెండు ప్రధాన పార్టీలు విపరీతంగా కృషి చేయడం ఇదే తొలిసారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. అటు ట్రంప్ ‘‘హిందూ వాయిసెస్ ఫర్ ట్రంప్’’ పేరిట, ఇటు బైడెన్ ‘‘హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్’’ పేరిట హిందూ ఓట్బ్యాంకును ఆకట్టుకునే యత్నాలు ముమ్మరం చేశారు. ఎవరికి వారు తామే హిందువుల హక్కుల పరిరక్షకులమని, వారి ఉన్నతికి తోడ్పడతామని చెప్పుకుంటున్నారు. 2016లో హిందూ ఓట్బ్యాంక్ బలాన్ని గమనించిన ట్రంప్ వీరిని ఆకట్టుకునేందుకు పలు యత్నాలు చేశారు. ఆయన, ఆయన కుటుంబసభ్యులు పలు దేవాలయాలను సందర్శించారు. ఈ దఫా మరోమారు వీరి మద్దతు కోసం ట్రంప్ యత్నిస్తుండగా, వీరిని తనవైపునకు మలచుకునేందుకు బైడెన్ ప్రయత్నిస్తున్నారు.
అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న సుమారు 20 లక్షల హిందువుల ఓట్లు ఎన్నికల్లో కీలకంగా మారాయి. భారత సంతతికి చెందిన రాజకీయనేత రాజా కృష్ణమూర్తి కూడా ఈ మాటే అంటున్నారు. అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేసే స్వింగ్ స్టేట్స్లో హిందువుల ఓట్బ్యాంక్ చాలా ముఖ్యమైనది. డెమొక్రటిక్ పార్టీకి చెందిన కృష్ణమూర్తి ఆన్లైన్లో హిందూ అమెరికన్స్ ఫర్ బైడెన్ పేరిట ప్రచారం ఆరంభించారు.
ఫ్లోరిడా, వర్జీనియా, పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్.. ఇలా అనేక రాష్ట్రాల్లో హిందూ ఓట్బ్యాంక్ చాలా కీలకమని, ప్రతిఒక్కరూ ఓట్ వేయడం ద్వారా స్వీయధర్మాన్ని పాటించాలని భారత సంతతికి చెందిన నేతలు అంటున్నారు. మూడున్నరేళ్లుగా దేశంలో విద్వేష ప్రసంగాలు, వివక్ష పెరిగిపోయాయని ప్రచారంలో పాల్గొన్న న్యూజెర్సీ కో స్టేట్ డైరెక్టర్ నికి షా అభిప్రాయపడ్డారు. ట్రంప్ పాలనలో హిందువులపై విద్వేషం మూడు రెట్లు పెరిగిందని విమర్శించారు. కెంటకీలో స్వామినారాయణ్ గుడి వద్ద జరిగిన విధ్వంసాన్ని టెంపుల్ ప్రతినిధి రాజేశ్ పటేల్ వివరించారు. బైడెన్ మాట నిలబెట్టుకునే మనిషని, సమానత్వాన్ని విశ్వసిస్తాడని కృష్ణమూర్తి చెప్పారు. అందువల్ల ఆయనకు మద్దతు పలకాలని కోరారు.