ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తో పోల్చిన కంగన పెద్ద దుమారమే లేపింది. దాంతో శివసేన ..కంగన మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తనపై విమర్శలు చేస్తున్నవారిపై కంగనారనౌత్ మరోసారి విరుచుకుపడ్డారు. శివసేన ఎంపీ సంజయ్రౌత్ పురుష అహంకారి అని విమర్శించారు. భారతీయ మహిళలపై ఇన్న ఘోరాలు, అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమే కారణమి మండిపడ్డారామె. తాను మహారాష్ట్రవాసిని కాదన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని అన్నారు. గతంలో ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా ప్రశ్నించారు.
తానొక మహిళను అయినందునే శివసేన ఎంపీ రెచ్చి పోతున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం సాయంత్రం కంగనా ట్విటర్లో వీడియో విడుదల చేశారు. సెప్టెంబర్ 9 న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఆమె విమర్శకులకు సవాల్ విసిరారు.
కంగన ప్రస్తుతం ఆమె సిమ్లాలోని తన సొంతింట్లో ఉన్నారు.
ఇదిలాఉండగా.. కంగనా రనౌత్కు కేంద్ర ప్రభుత్వం వై-ప్లస్ కేటగిరీ భద్రత కల్పించనుంది. వ్యక్తిగత భద్రతా అధికారి, కమాండోలతో సహా 11 మంది సాయుధ పోలీసులు ఆమెకు రక్షణగా ఉంటారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వర్గాలు ఈ విషయం తెలిపాయి. నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం తరువాత సినీ పరిశ్రమలోని డ్రగ్ మాఫియా పై కంగనా గళమెత్తింది. వారి నుంచి ఆమెకు ముప్పు ఉందని భావించి భద్రత కల్పించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.